రికార్డ్ స్థాయిలో 800 కంటి ఆపరేషన్లు : డాక్టర్ సంజీవరావు
జనవరి 10, నల్లా సమాచార్ న్యూస్ / భద్రాచలం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం, పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్, మారుతి నర్సింగ్ కళాశాల భద్రాచలం, వాసవి ఎన్నారై యుఎస్ఏ వారి సహకారంతో నవంబర్ ఆరవ తారీఖున ప్రారంభమైన కంటి వైద్య శిబిరం విజయవంతంగా నడుస్తున్నదనీ ఆప్తాల్మిక్ ఆఫీసర్ సంజీవరావు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవరావు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అనుమతితో ఈ వైద్య శిబిరం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ రాహుల్ ప్రారంభించడం జరిగినదని,కంటి వైద్య శిబిరంలో సుమారు 1200 పైచిలుకు కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని పరీక్షించి ఎనిమిది వందల పైచిలుకు కంటి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించి 20 విడతలుగా భద్రాచలం నుంచి పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్కు ట్రిప్పుకు 41 మంది చొప్పున పంపించారని తెలిపారు.ముఖ్యంగా పినపాక,భద్రాచలం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ములుగు జిల్లా మరియు ఆంధ్ర నుంచి కూడా కంటి సమస్యలతో బాధపడుతున్న వారు వచ్చి కంటి ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, కంటి వైద్య శిబిరాన్ని భద్రాచలం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య సందర్శించారని ఒకే కంటి వైద్య శిబిరం నుంచి ఎనిమిది వందల పైచిలుక కంటి ఆపరేషన్లు జరగటం రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడిన వైద్య శిబిరముగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొనడం జరిగినదనీ అన్నారు. 75 రోజుల నుంచి నేత్ర వైద్య శిబిరాలు నిర్విరామంగా జరపటం ఇది ఒక గర్వించదగ్గ గొప్ప విషయం అని కలెక్టర్ కొనియాడారు. డాక్టర్ ఎస్.ఎల్ కాంతారావు మాట్లాడుతూ ఇంత భారీ ఎత్తున జరగటానికి డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు,డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎల్ భాస్కర్ నాయక్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చైతన్య,ఏరియా హాస్పిటల్ మణుగూరు సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్,ఆప్తాల్మిక్ ఆఫీసర్ సంజీవరావు ఎంతో సహకరించారని తెలియజేసినారు.