27.10.24 నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ 9849396606
ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం సహకరించండి
సీఎం గారికి నివేదించి ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేయించండి
ఉర్దూ మీడియం నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘం చీప్ విప్ మహేందర్ రెడ్డికి నివేదన
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ మీడియం శిక్షణ పొందిన నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘం అభ్యర్థించింది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికి తాండూరులో వినతిపత్రం సమర్పించారు.
ఆదివారం తాండూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు క్యాంపు కార్యాలయం వద్ద శిక్షణ పొందిన
నిరుద్యోగ ఉర్దూ మీడియం ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఖాజా పాషా, అబ్దుల్ నాసర్, అబ్రహాం, రేహాన్, అస్లం తదితరులు మహేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా శిక్షణ పొందిన ఉర్దూ మీడియం నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు రాష్ట్రంలో 666 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాకుండా గత 20 ఏళ్లుగా ఉన్నాయని వివరించారు.
గతంలో సీఎం గా ఉన్నప్పుడు కెసిఆర్ నిర్లక్ష్యం వహించారని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉర్దూ మీడియం పాఠశాలలు మూతపడకుండా చూస్తానన్న నేపథ్యంలో ఈ పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని వారు కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర కోటాలో మిగిలిపోయిన ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి మెరిట్ విధానం ద్వారా భర్తీ చేయాలని అందుకు సీఎం గారితో చర్చించాలని మహేందర్ రెడ్డి గారికి విన్నవించారు.
అందుకు స్పందించిన మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారితో నిరుద్యోగుల సమస్యలను వివరిస్తానని, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో శిక్షణ పొందిన నిరుద్యోగ ఉర్దూ మీడియం అధ్యాపక అభ్యర్థులను భేటీ చేయించి సమస్యను పరిష్కరించి, రాష్ట్రంలో ఉర్దూ మీడియం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ప్రత్యేక ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కృషి చేశారని సంఘం నాయకులు ఆయనకు గుర్తుచేసి, మరోసారి అందరికీ సహకరించాలని వారు కోరారు.