మందాడి ప్రభాకరరెడ్డి (1935 – 1997)
( సినీ కార్మిక పక్షపాతి ~ దానశీలి )
~~~~~~~~~~~~~~
విలక్షణ మనస్తత్వం…
మూర్తిభవించిన మానవత్వం….
సినీ కార్మిక పక్షపాతం…
వెరసి
మందాడి ప్రభాకరరెడ్డి
▪️వివరాల్లోకి వెళ్తే….
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వాస్తవ్యుడు మందాడి లక్ష్మారెడ్డి, కౌసల్యాదేవి దంపతులకు రెండో సంతానంగా ప్రభాకరరెడ్డి అక్టోబర్ 8, 1935. జన్మించాడు.వీరిది భూస్వామ్య కుటుంబం. మందాడి లక్ష్మారెడ్డి గారు తుంగతుర్తి చుట్టుపక్కల 40 గ్రామాలకు దొర.. వీరికి ఐదుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు.
ప్రభాకరరెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం తుంగతుర్తిలోనే కొనసాగింది. తర్వాత హైదరాబాదు సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, . 1955 ~1960 మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్య పూర్తి చేశారు.
▪️రంగస్థల కళాకారుడుగా…
పాఠశాల స్థాయి నుండే ప్రభాకరరెడ్డికి విద్యార్థి రాజకీయాల మీద, రంగస్థల నటన మీద, బుర్రకథలు చెప్పడం మీద ఆసక్తి ఉండేది. అట్లా గుమ్మలూరి శాస్త్రి దర్శకత్వంలో రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన
చాణక్య చంద్రగుప్త నాటకంలో ” సెల్యూకస్గా ” నటన ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత ఇదే నాటకం వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తే అదే పాత్రలో నటించి అందరి మెప్పును సంపాదించుకున్నాడు.
▪️సినీరంగ ప్రవేశం
గుత్తా రామినీడు 1960లో దర్శకత్వం వహించిన
” చివరకు మిగిలేది” సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. హౌస్ సర్జన్ గా ఉన్నప్పుడే నటుడుగా అవకాశం వచ్చింది.ఈ సినిమా కొంత కాలం డాక్టర్గా ప్రాక్టీస్ చేసినప్పటికీ అవకాశాలు రావడంతో మద్రాసు మద్రాస్ వెళ్ళిపోయాడు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని ప్రవృత్తినే వృత్తిగా మలుచుకుని నటనలోనే తన జీవితకాలం కొనసాగారు.
ప్రభాకరరెడ్డిలో కథానాయకుడి లక్షణాలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ ప్రతి నాయకుడిగానే స్థిరపడిపోయాడు. దుర్మార్గుడైన ప్రతినాయకుడిగా
పాత్రలకు ప్రాణం పోయడమే కాదు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
1960 ~ 1991 మధ్య కాలంలో నటుడిగా పరంపర కొనసాగించారు
1960 లో చివరకు మిగిలేది సినిమా నుండి, 1991 అల్లూరి దిద్దిన కాపురం సినిమా వరకు రకరకాల పాత్రలు పోషించారు. సాంఘిక , జానపద, పౌరాణిక,
జేమ్స్ బాండ్ పాత్రల్లో మెప్పించారు.
వీరు మొత్తం 472 సినిమాల్లో నటించాడు.
▪️ మద్రాసు నుండి హైదరాబాదుకు పరిశ్రమ
1990 లలో మద్రాసులో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాదుకు తరలించడంలో విశేషంగా కృషి చేశారు.
▪️600 కోట్ల ఆస్తితో చిత్రపురి కాలనీ
తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాద్ తరలి వచ్చిన తరువాత
పేద సినీ కళాకారులకు కార్మికులకు సొంత ఇల్లు కల్పించాలన్న సంకల్పంతో హైదరాబాద్ మణికొండలో తన సొంత 10 ఎకరాల పొలం దానంగా ఇచ్చారు. కళాకారుల కోసం నిర్మించబడిన కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న డా. ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి కాలనీ .ప్రస్తుతం ఈ భూమి విలువ 600 కోట్లు. ప్రభాకరరెడ్డి కారణంగానే ఇప్పుడు ఐదువేల మంది కార్మికులంతా సొంతిళ్లలో ఉంటున్నారు.
▪️రచయితగా ~ దర్శకుడిగా ~ నిర్మాతగా
రచయితగా ~
ప్రభాకరరెడ్డి మంచి రచయితగా విజయం సాధించారు. వీరు కథ అందించిన “పండంటి కాపురం” సినిమా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 1972లో అవార్డు అందుకుంది.
రచయితగా మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.
దర్శకుడుగా ~
1987 లో మండలాధీశుడు, 1988 లో ప్రచండ భారతం, 1989లో గండిపేట రహస్యం,
1996 లో కామ్రేడ్ వంటి చిత్రాలు నిర్మించాడు. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించాక చిత్ర పరిశ్రమ రెండుగా చెలిపోయింది. ఒక వర్గం ఎన్టీ రామారావుకి అనుకూలంగా ఉంటే , మరొక వర్గం ఎన్టీ రామారావుకి ప్రతికూలంగా పనిచేసింది. ప్రభాకర్ రెడ్డి ప్రతికూల వర్గంలో కొనసాగాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలను ఎన్.టి.ఆర్. వ్యవహారశైలి మీద ఎదురుదాడిగా తీసిన రాజకీయ వ్యంగ్య చిత్రాలుగా
పేర్కొనవచ్చు.
నిర్మాతగా ~
‘జయప్రద’ పిక్చర్స్ ను స్థాపించి పలు చిత్రాలు నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి పలు సినిమాలకు నిర్మాతగా నిర్మాణ భాగస్వామ్యం వహించారు..మొత్తం 27 చిత్రాలను నిర్మించాడు.
▪️కళాకారుల పరిచయం
1972 లో ‘పండంటి కాపురం’ సినిమా ద్వారా జయసుధను ~
1975 లో ‘నాకూ స్వాతంత్రం వచ్చింది’ ద్వారా రచయిత గణేశ్ పాత్రోను ~
1976లో ‘భూమికోసం’ సినిమా ద్వారా జయప్రదను~
1989 లో ‘శ్రీరామచంద్రుడు’ సినిమా ద్వారా గీత రచయిత వెన్నెలకంటిని ~
తెలుగు తెరకు ప్రభాకరరెడ్డి గారే పరిచయం చేశారు
▪️భక్తి చింతన
ప్రభాకరరెడ్డి అమ్మ వారి భక్తుడు.. కాగా ప్రతి కార్తీక పౌర్ణమికి ఇంట్లో సత్యనారాయణ వ్రతం, శివుడి పూజ చేయించేవారు. .ప్రతి ఏటా . అయ్యప్ప మాల వేసుకుని, కఠిన నియమాలు పాటించేవారు.
▪️పురస్కారాలు
1972 లో వీరు కథ అందించిన
“పండంటి కాపురం ” చిత్రం జాతీయస్థాయి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకున్నది .
వీరిని ఐదు నంది అవార్డులు వరించాయి.
1)1973 ~ఉత్తమ కథారచయిత -గాంధీ పుట్టిన దేశం చిత్రం
2)1981 ~ ఉత్తమ నటుడు – పల్లె పిలిచింది చిత్రం
3)1980 ~ ఉత్తమ నటుడు – యువతరం కదిలింది చిత్రం
4)1982 ~ఉత్తమ కథారచయిత – గృహప్రవేశం చిత్రం
5)1990 ~ ఉత్తమ సహాయ నటుడు -చిన్నకోడలు చిత్రం
▪️కుటుంబం
ప్రభాకరరెడ్డి భార్య సంయుక్త మంచి అభిరుచి కలిగిన ఉత్తమ గృహిణి. భర్తకు అన్ని విధాలుగా సహకరించింది. కథలు డిస్కషన్ చేయడంలోనూ వివిధ భాష చిత్రాలు చూసి ఆ పాత్రల గురించి చర్చించడంలోనూ, భర్త నటించిన పలు సినిమాల్లో నటి నటులకు కాస్ట్యూమ్ డిజైన్ చేయడంలోనూ తనవైన సహాయ సహకారాలు అందించింది.
ఈ దంపతులకు నలుగురు ఆడపిల్లలు. గంగ, శైలజ, లక్ష్మి, విశాలాక్షి.
గ్రామదేవత గంగమ్మతల్లి పేరు మీదుగా పెద్ద కూతురు గంగ పేరు పెట్టారు. మిగతా కూతుర్ల పేర్లు కూడా అమ్మవారిని ఉద్దేశించి పెట్టినవే.
▪️చిత్రపురిలో ప్రభాకరరెడ్డి విగ్రహం
కోట్ల రూపాయల విలువైన తన సొంత భూమిని పరిశ్రమనే నమ్ముకొని పనిచేస్తున్న పేదల కోసం గొప్ప హృదయంతో ఇచ్చిన ప్రభాకరరెడ్డి మానవీయతకు కృతజ్ఞతగా… చిత్రపూరి కాలనీలో .ప్రభాకరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి , కుటుంబ సభ్యుల సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ చేశారు.
▪️శివైక్యం
నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, కథారచయితగా తెలుగు సినిమా రంగానికి తన వైన సేవల్ని అందించిన మందాడి ప్రభాకరరెడ్డి గారు..సినిమాల్లో విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం హీరోగా మిగిలిపోతూ
1997 నవంబరు 26 న తన 62 వ ఏట ఆకస్మాత్తుగా కాలధర్మం పొందారు. వారి భౌతికంగా లేకపోయినా వారి సేవలు చిరస్మరణీయమైనవి. తెలుగు సినిమా వర్ధిల్లినంత కాలం చిత్రపురిలో వారి పేరు వినిపిస్తూనే ఉంటుంది.
సేకరణ
డా. తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి