మెడికల్ కోర్సుల ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
మెడికల్ ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ -ప్రస్తుత ఎన్ ఎం సి) నిబంధనల ప్రకారం ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్( ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు) రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఆగస్టు 28న ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ బిజెపికి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జై శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎంసీఐ నోటిఫికేషన్ ప్రకారము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాల్సి ఉందన్నారు. అయితే రాష్ట్రంలో ఆ ప్రస్తావనే లేకుండా ప్రవేశాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2024-25 విద్యా సంవత్సరానికి ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని రికార్డు చేసిన ధర్మాసనం పిటిషన్ పై విచారణను మూసివేసింది.