నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్:
యాంత్రికంగా మారిన ఆధునిక మానవ జీవితంలో శాంతి, సమాధానాలు తప్పనిసరి అవసరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. సమాజాన్ని శాంతియుత మార్గంలో నడిపించడంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ ఆశయాలకు దగ్గరగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలిపారు. రైతుల సంక్షేమం, డ్రగ్స్ వంటి మహమ్మారుల నుంచి యువతను కాపాడి, వారికి సాధికారత నేర్పడంలో బ్రహ్మ కుమారీస్ మార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోందని చెప్పారు. మౌంట్ అబూ (రాజస్థాన్) తర్వాత హైదరాబాద్ లో బ్రహ్మ కుమారీల శాంతి సరోవర్ ఉండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని “బ్రహ్మ కుమారీస్ – శాంతి సరోవరం” 20వ వార్షికోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యల్ని నివారించి, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతుల రుణమాఫీకి రూ. 31వేల కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. యువత పెడదారులు పట్టకుండా, డ్రగ్స్ పేరు వింటేనే భయపడేలా నార్కోటిక్స్ టీమ్స్ ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని, ప్రముఖ పారిశ్రామికవేత్తల సారధ్యంలో ఈ యూనివర్సిటీ నడుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
శాంతి సరోవరం లీజ్ పొడిగింపుతో సహా అన్ని విషయాల్లో బ్రహ్మ కుమారీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. మౌంట్ అబూలో జరగబోయే బ్రహ్మ కుమారీల గ్లోబల్ సదస్సులో పాల్గొంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.